తవ్వే కొద్దీ బయటపడుతున్న శివ బాలకృష్ణ లీలలు

హైదరాబాద్‌: తవ్వేకొద్దీ హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో టీడీఆర్‌ స్కాం వెలుగులోకి వచ్చింది. కృష్ణకుమార్, శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది..

కృష్ణకుమార్‌ని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.

హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పని చేసిన బీవీ కృష్ణ కుమార్.. బడా బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్‌ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నష్టం చేశారు. బిల్డర్లకు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్స్ క్లియర్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కృష్ణ కుమార్ చర్య వల్ల ప్రభుత్వానికి 3800 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ అంచనా వేస్తోంది. మరో ఇద్దరు హెచ్‌ఎండీఏ ప్లానింగ్ అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. బడా బిల్డర్ల ప్రాజెక్ట్‌ల ప్లానింగ్‌లో టీడీఆర్‌ విలువ తగ్గించి, తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వానికి నష్టం చేశారు..

శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు కాగానే కృష్ణకుమార్‌ అమెరికాకు వెళ్లిపోగా, అక్కడ నుంచి హైదరాబాద్‌కు రప్పించే ప్రయత్నాలను ఏసీబీ అధికారులు చేస్తున్నారు. శివబాలకృష్ణ, కృష్ణ కుమార్, మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు సిండికేట్‌పై ఏసీబీ దృష్టి పెట్టింది..